మధ్యప్రదేశ్‌లో రేపే బలపరీక్ష.. రెడీ అవుతున్న కమల్‌నాథ్!

  • జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడిన తర్వాత సంక్షోభం
  • మైనారిటీలో పడిందన్న శివరాజ్‌సింగ్ చౌహాన్
  • బలపరీక్షకు సిద్ధం కావాలంటూ గవర్నర్ ఆదేశం
సంక్షోభంలో పడిన కమల్‌నాథ్ సర్కారు రేపు బలపరీక్షకు సిద్ధమవుతోంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోబోతున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్ ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతిని ఆదేశించినట్టు తెలిపారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ నిన్న సాయంత్రం గవర్నర్‌ను కలిసి చర్చించారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే కమల్‌నాథ్ ప్రభుత్వంతో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.  

కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, ఫలితంగా ప్రభుత్వాన్ని నడిపే హక్కు కోల్పోయిందని ఈ సందర్భంగా చౌహాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోవాల్సిందేనని, అప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు లేదని అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం బలపరీక్షకు సిద్ధం కావాలని స్పీకర్‌ను గవర్నర్ ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. యువ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడిన తర్వాత.. ఆయనకు మద్దతుగా మరో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడింది.

Madhya Pradesh
Kamal Nath
Congress
BJP

More Telugu News